Ponniyin Selvan 2 Movie Review: PS 2 రివ్యూ.. చోళుల కథలు, వ్యథలతో పొన్నియిన్‌ సెల్వన్‌!

బావుందని, బాలేదని, బాగానే ఉన్నట్టుందని రకరకాల మాటలు వినిపించాయి పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్ ఒన్‌ విషయంలో. అన్నిటిని తుడిచిపెట్టి రూ.500కోట్లు కలెక్ట్ చేసి చోళుల కథకున్న వైభవాన్ని గట్టిగా చాటి చెప్పింది పీయస్‌1. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో సెకండ్‌ పార్ట్‌ని డిజైన్‌ చేశారు మణిరత్నం. పీయస్‌2 ఎలా ఉంది? ఫస్ట్ పార్టులో వినిపించిన ప్రశ్నలకు సెకండ్‌ పార్టులో సమాధానం చెప్పారా? చదివేద్దాం రండి.

Ponniyin Selvan 2 Movie Review: PS 2 రివ్యూ.. చోళుల కథలు, వ్యథలతో పొన్నియిన్‌ సెల్వన్‌!
Ponniyin Selvan 2 Review
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 28, 2023 | 4:18 PM

చోళుల కథలు, వ్యథలతో పొన్నియిన్‌ సెల్వన్‌!

బావుందని, బాలేదని, బాగానే ఉన్నట్టుందని రకరకాల మాటలు వినిపించాయి పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్ ఒన్‌ విషయంలో. అన్నిటిని తుడిచిపెట్టి రూ.500కోట్లు కలెక్ట్ చేసి చోళుల కథకున్న వైభవాన్ని గట్టిగా చాటి చెప్పింది పీయస్‌1. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో సెకండ్‌ పార్ట్‌ని డిజైన్‌ చేశారు మణిరత్నం. పీయస్‌2 ఎలా ఉంది? ఫస్ట్ పార్టులో వినిపించిన ప్రశ్నలకు సెకండ్‌ పార్టులో సమాధానం చెప్పారా? చదివేద్దాం రండి.

నటీనటులు: విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, ప్రభు, శరత్‌కుమార్‌, పార్తిబన్‌, రెహమాన్‌, లాల్‌ తదితరులు

ఇవి కూడా చదవండి

కెమెరా: రవివర్మన్‌

మూల కథ: కల్కి కృష్ణమూర్తి

ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

నిర్మాణ సంస్థ: మెడ్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్

దర్శకత్వం: మణిరత్నం

మాటలు: తనికెళ్ల భరణి

పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌

నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్‌

రిలీజ్‌ డేట్‌: 28.04.23

పీయస్‌1 రీక్యాప్‌: సముద్రంలో మునిగిన పొన్నియిన్‌ సెల్వన్‌ ఏమయ్యాడు? ఆదిత్య కరికాళుడు తంజావూరుకు తిరిగి వస్తాడా? రాడా? ఎన్నాళ్లుగానో కుమిలిపోతున్న సుందరరాజచోళన్‌ మనసులో ఉన్న దిగులేంటి? పాండవులకు నందిని చేసిన సపోర్ట్ ఎటు దారితీసింది? పొన్నియిన్‌ సెల్వన్‌ని ఒకటికి రెండు సార్లు కాపాడిన మందాకిని ఎవరు? ఆమెకీ, నందినికి ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఆదిత్య – నందిని లవ్‌స్టోరీ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోయారు? నందినిని దగ్గర తీసిన పాండ్యరాజు ఆమెకేమవుతాడు? వందియదేవన్‌కి కుందవై ఏం చెప్పింది? వానదిని పొన్నియిన్‌ సెల్వన్‌ వివాహం చేసుకున్నాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ద్వితీయ విభాగం.

పీయస్‌2..

పీయస్‌2 కథలోకి వెళ్తే ఆదిత్య చోళుడు (విక్రమ్‌)ని కడంబూర్‌కి ఆహ్వానిస్తూ వర్తమానం పంపుతుంది నందిని (ఐశ్వర్య). పొన్నియిన్‌ సెల్వన్‌ (జయం రవి) బతికే ఉన్నాడన్న సంగతిని కుందవై (త్రిష)కి చెబుతాడు వందియదేవన్‌ (కార్తి). ఆదిత్యుడు, కుందవై కలిసి నాగపట్టణంలో బౌద్ధారామంలో చికిత్స పొందుతున్న పొన్నియిన్‌ సెల్వన్‌ని పరామర్శిస్తారు. కడంబూర్‌కి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు అక్కడ తోబుట్టువులతో చెబుతాడు ఆదిత్యుడు. వెళ్లవద్దని కుందవై, పొన్నియిన్‌ సెల్వన్‌, వందియనదేవన్‌ వారిస్తారు. అయినా వినకుండా వెళ్తాడు ఆదిత్యుడు. కడంబూర్‌ రాజు ఆధ్వర్యంలో మిగిలిన సామంత రాజుల సమావేశం జరుగుతుంది. చోళ రాజ్యాన్ని విభజించాలని మధురాంతకదేవుడికి సగభాగం ఇవ్వాలనే చర్చలు జరుగుతాయి. పెరియ పళువేట్టయర్‌ (శరత్‌కుమార్‌) కూడా మధురాంతకదేవుడు (రెహమాన్‌) వైపు మాట్లాడుతాడు. చోళ రాజ్యాన్ని విభజించడం ఇష్టం లేకపోయినా, కృష్ణా తీరానికి దక్షిణాదిన ఉన్న భూభాగాన్ని మధురాంతకుడికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఆదిత్యుడు. కృష్ణకు ఉత్తరాన ఉన్న భాగాన్ని తానుగానీ, తన తమ్ముడుగానీ పాలిస్తామని అంటాడు. అదే రోజు రాత్రి నందిని చేతిలో హత్యకు గురవుతాడు ఆదిత్యుడు. పొన్నియిన్‌ సెల్వన్‌ రాజ్యం కోసం అన్నను చంపడానికి కుట్ర చేశాడని ప్రచారం జరుగుతుంది. వందియదేవన్‌ మీద ఆ నేరం మోపుతారు. చివరకు ఏమైంది? ఆదిత్య చోళుడి హత్య గురించి సుందరరాజ చోళుడికి ఎవరు చెప్పారు? పొన్నియిన్‌ సెల్వన్‌ సింహాసనాన్ని అధిష్టించాడా? లేదా? వంటివన్నీ ఆసక్తికరం.

విశ్లేషణ..

చారిత్రాత్మక చిత్రాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి. అందులోనూ చోళాస్‌ ఆర్‌ బ్యాక్‌ అంటూ ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ టీమ్‌ చేసిన ప్రచారం చాలా ముచ్చటగా అనిపించింది. స్క్రీన్‌ మీద కూడా ఆ పాజిటివ్‌ వైబ్స్ కనిపించాయి. సముద్రంలో మునిగి, విష జ్వరంతో బాధపడి, అందులో నుంచి కోలుకుని, ప్రజలకు ఆదర్శంగా నిలిచే రాజుగా జయం రవి అద్భుతంగా నటించారు. వానతి కేరక్టర్‌లో శోభిత కాసేపే కనిపించినా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. వందియదేవర్‌గా, వల్లం యువరాజుగా రకరకాల షేడ్స్ ఉన్న కేరక్టర్‌లో కార్తి ఒదిగిపోయారు. కార్తి, జయరామన్‌ కేరక్టర్లు తెరమీద కనిపించినంత సేపూ రిలీఫ్‌గా ఫీలయ్యారు జనాలు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే, పీయస్‌2లో ఐశ్వర్యరాయ్‌ కేరక్టర్‌ తప్పకుండా మెన్షన్‌ చేసేలా ఉంది. సిట్చువేషన్స్ కి తగ్గట్టు కళ్లతోటే అద్భుతంగా నటించారు ఐశ్వర్య. జనాల గుండెల్లో నిలిచిపోయేలా పెర్ఫార్మ్ చేశారు విక్రమ్‌. కుందవై కేరక్టర్‌లో త్రిష కనిపించినంత సేపూ చూపుతిప్పుకోలేదు జనాలు. ఆదిత్య, నందిని యంగర్‌ వెర్షన్‌లో నటించిన నటులు కూడా చాలా బాగా నటించారు. లొకేషన్లు కొత్తగా అనిపించాయి. ప్రతి ఫ్రేమూ అందంగా కనిపించింది. సిట్చువేషన్‌కి తగ్గట్టు పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని అందించారు రెహమాన్‌. ఫస్ట్ పార్టులో ఎవరేంటో అర్థం కాని వారికి, పీయస్‌2లో ఆ ఇబ్బంది ఉండదు. చోళ రాజ్యంలో జరిగిన రాజకీయాలు, దాయాదుల మధ్య జరిగిన గొడవలు, ప్రేమ, ద్వేషం, చోళులను తుదముట్టించాలని పాండ్యులు పన్నిన పన్నాగాలు, రాష్ట్రకూటులు, పల్లవులతో కలిసి మధురాంతకుడు చేసిన కుట్రలు… ఇవన్నీ స్క్రీన్‌ మీద చూసి తీరాల్సిందే. ప్రతి పాత్రకూ పర్ఫెక్ట్ కాస్ట్యూమ్స్ కుదిరాయి. నందిని, కుందవై, వానతి ధరించిన నగలు కూడా గుర్తుపెట్టుకోదగ్గరీతిలో ఉన్నాయి. చోళాస్‌ ఆర్‌ బ్యాక్‌ అని మణిరత్నం చెప్పినట్టే తీసుకొచ్చి చూపించారు. పొన్నియిన్‌ సెల్వన్‌ 2 చోళులను చక్కగా పరిచయం చేసే ప్రయత్నం. చివరిగా… చోళుల సామ్రాజ్యాన్ని సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూడాల్సిందే!

– డా. చల్లా భాగ్యలక్ష్మి