ATM Fraud: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా…? జాగ్రత్త.. మోసగాళ్లు ఇలా మోసం చేస్తారు!

ఎవరైనా బ్యాంక్ కస్టమర్ ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఆ మెషిన్ దగ్గరకు వెళ్లి కార్డ్ ఇన్సర్ట్ చేసినపుడు అది తిరిగి బయటకు రాకుండా అతుక్కుపోతుంది. ఈలోపు మోసగాళ్ళకు చెందిన వాడొకడు అక్కడకు వచ్చి.. తానూ బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పి ప్రోబ్లం చెక్ చేస్తానని నమ్మిస్తాడు. కార్డును అటూ ఇటూ లాగినట్టు ప్రయత్నిస్తాడు. తరువాత మీ పిన్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి.. అని చెబుతాడు. పిన్ ఎంటర్ చేస్తున్న సమయంలో దానిని తెలుసుకుంటాడు..

ATM Fraud: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా...? జాగ్రత్త.. మోసగాళ్లు ఇలా మోసం చేస్తారు!
Atm Fraud
Follow us

|

Updated on: Aug 18, 2023 | 4:48 PM

సురేష్ కంగారు కంగారుగా ఆఫీసులోకి వస్తున్నాడు. అది చూసిన అతని కొలీగ్ హరీష్ ఏమైంది? అని అడిగాడు. ATM మిషిన్ లో తన ఏటీఎం కార్డు చిక్కుకుపోయిందని చెప్పాడు సురేష్. ఇప్పుడు కార్డ్ ఎక్కడ ఉంది అని అడిగాడు హరీష్. అది ఇంకా ఏటీఎం మిషిన్‌లోనే ఉండిపోయింది అని బదులిచ్చాడు సురేష్. వెంటనే బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయి అని సలహా ఇచ్చాడు హరీష్. అదే పని చేశాడు సురేష్. అయితే కార్డ్ తిరిగి పొందాలంటే 2 నుంచి ౩ గంటలు పడుతుందని హెల్ప్ లైన్ లో సమాధానం ఇచ్చారు. సరే అని వారు వెయిట్ చేస్తున్నారు. 15 నిమిషాలు గడిచాయి. సురేష్ ఫోన్ కు వరుస మెసేజ్ లు వచ్చాయి. వాటిని చెక్ చేసిన సురేష్ షాక్ అయ్యాడు. ఎందుకంటే, అతని ఎకౌంట్ నుంచి ఒక్కోసారి 15000 రూపాయల చొప్పున నాలుగు దఫాలుగా డబ్బులు విత్ డ్రా అయిపోయాయి.

సురేష్ లా చాలామంది ఇటీవల కాలంలో ఏటీఎం మోసాలకు గురయ్యారు. దీనిని ఏటీఎం ట్రాపింగ్ అంటారు. ఈ మధ్య ఢిల్లీ-NCRలో ఇంలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఈ ఏడాది జూన్‌లో గౌతమ్‌బుద్ధనగర్‌ పోలీసులు ఏటీఎం ట్రాపింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసి నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎంలను ఈ ముఠా టార్గెట్ చేసేది. ఈ ముఠా సభ్యులు ఏటీఎం మిషిన్ రీసెర్చ్ చేస్తారు. తరువాత మిషిన్ లో కార్డ్ ఎంటర్ చేసే ప్రదేశంలో ఫేవి క్విక్ వంటి జిగురు పూస్తారు. అలాగే అక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ల స్థానంలో నకిలీ హెల్ప్ లైన్ నెంబర్లను అతికిస్తారు.

ఎవరైనా బ్యాంక్ కస్టమర్ ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఆ మెషిన్ దగ్గరకు వెళ్లి కార్డ్ ఇన్సర్ట్ చేసినపుడు అది తిరిగి బయటకు రాకుండా అతుక్కుపోతుంది. ఈలోపు మోసగాళ్ళకు చెందిన వాడొకడు అక్కడకు వచ్చి.. తానూ బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పి ప్రోబ్లం చెక్ చేస్తానని నమ్మిస్తాడు. కార్డును అటూ ఇటూ లాగినట్టు ప్రయత్నిస్తాడు. తరువాత మీ పిన్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి.. అని చెబుతాడు. పిన్ ఎంటర్ చేస్తున్న సమయంలో దానిని తెలుసుకుంటాడు. చిక్కుకుపోయిన ఏటీఎం కార్డ్ ఎంత ప్రయత్నించినా రావడం లేదు కదా.. మీరు ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి. వాళ్ళు టెక్నీషియన్ ని పంపించి మీ కార్డు తీయించి ఇస్తారు అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ మోసగాడు. దీంతో కస్టమర్ అక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేస్తాడు. కస్టమర్ చేసిన కాల్ అందుకున్న మోసగాళ్ళ ముఠా లోని సభ్యుడు.. రెండు నుంచి మూడు గంటల్లో మీ కార్డు బయటకు తీసి మీరు చెప్పిన చోటుకు పంపిస్తామని ఎడ్రస్ చెప్పమని అడుగుతారు. ఎడ్రస్ చెప్పిన తరువాత కస్టమర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కస్టమర్ ఇలా ఏటీఎం దగ్గర నుంచి పక్కకు వెళ్ళిన వెంటనే ముఠా లోని ఇంకో సభ్యుడు వచ్చి ఆ కార్డ్ ను తీసుకుని పక్కనే ఉన్న ఇంకో మిషిన్ నుంచి డబ్బు డ్రా చేసేయడం మొదలు పెడతాడు. అలా కస్టమర్ ఎకౌంట్ ఖాళీ చేసేసి అక్కడ నుంచి మోసగాడు డబ్బుతో పారిపోతాడు.

ఇవి కూడా చదవండి

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి 2022లో ATM- ఇతర మోసాల కేసులు 65% పెరిగినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ మోసాల్లో దోచుకున్న డబ్బు 2021తో పోలిస్తే దాదాపు రెండింతలు పెరిగింది. 2021లో 10 లక్షలకు పైగా ఇటువంటి మోసాలు జరిగాయి. ఈ మోసాల ద్వారా ప్రజల సొమ్ము రూ.1,119 కోట్లు కాజేశారు. ఇక 2022లో 17 లక్షలకు పైగా మోసాలు జరిగాయి వాటి నుంచి 2,113 కోట్ల రూపాయల పౌరుల సొమ్ము కొల్లగొట్టారు.

ఇప్పుడు వివిధ రకాల ఏటీఎం మోసాల గురించి తెలుసుకుందాం.

ఏటీఎం కార్డ్ ట్రాపింగ్‌తో పాటు, మోసగాళ్లు అనేక ఇతర పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వీటిలో స్కిమ్మింగ్, షిమ్మింగ్, పిన్ థెఫ్ట్ – క్యాష్ ట్రాపింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. స్కిమ్మింగ్ అంటే మోసగాళ్లు కాల్‌లు లేదా ఇతర ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా ఏటీఎం కార్డ్ డేటాను దొంగిలించడం. వారు కస్టమర్ ఎకౌంట్ నుంచి అనధికారిక లావాదేవీలు చేస్తారు.

షిమ్మింగ్‌లో, మోసగాళ్లు ఏటీఎం మెషీన్‌ను తారుమారు చేసి, షిమ్మింగ్ పరికరం అనే చిన్న పరికరాన్ని ఇన్‌స్టాల్ చేస్తారు. షిమ్మింగ్ పరికరం ఏటీఎంలో కస్టమర్ కార్డ్‌ని చొప్పించినప్పుడు మాగ్నెటిక్ స్ట్రిప్ నుంచి డేటాను రికార్డ్ చేస్తుంది. ఆ తరువాత ఆ డేటా ఆధారంగా ఎకౌంట్ నుంచి డబ్బు లాగేస్తారు. మరొక రకమైన మోసాన్ని పిన్ థెఫ్ట్ అంటారు. మోసగాళ్లు ఏటీఎం రూమ్ లేదా ప్లాస్టిక్ కీప్యాడ్ ఓవర్‌లేస్‌లో దాచిన కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇప్పుడు, మీరు ఏ పిన్‌ని నమోదు చేసినా, అది దాని కీస్ట్రోక్‌లను క్యాప్చర్ చేస్తుంది. దీని ద్వారా డబ్బు దోచేస్తారు.

ఏటీఎం మోసం చేయడానికి మరొక పద్ధతి కూడా ఉపయోగిస్తారు. దాన్ని క్యాష్ ట్రాపింగ్ అంటారు. మోసగాళ్లు క్యాష్ డిస్పెన్సర్‌లో పరికరాన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇది మిషిన్ నుంచి డబ్బు బయటకు రాకుండా ఆపుతుంది. మన డబ్బు డెబిట్ అయినట్టు ఫోన్‌లో మెసేజ్ వస్తుంది కానీ నగదు బయటకు రాదు. మీరు బ్యాంకుకు కాల్ చేసి చెబుతారు. లేదా డబ్బు రాకపోతే అది దానంతటదే తిరిగి జమ అవుతుందని భావిస్తారు. కానీ మీరు వెళ్లిపోయిన తర్వాత, మోసగాళ్లు  పరికరాన్ని తీసివేసి, చిక్కుకున్న నగదును డబ్బును బయటకు తీసి పట్టుకుపోతారు.

ఏటీఎం మోసాన్ని ఎలా నివారించాలి? అనే విషయంపై ఏటీఎంని ఉపయోగించే ముందు చెక్ చేసుకోవాలని ఫిన్ కార్ట్ వ్యవస్తాపకుడు, సీఈవో తన్వీర్ ఆలం చెబుతున్నారు. అలాగే సెక్యూరిటీ గార్డులు లేని ఖాళీ ఏటీఎంలను ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా, మీరు ఏటీఎం మోసానికి గురి అయితే, మీరు ఏమి చేయాలి? ఏమాత్రం కంగారు పడవద్దు. వెంటనే రెండు ముఖ్యమైన పనులు చేయండి. మొదట, మీ కార్డ్‌ని బ్లాక్ చేసి, రెండవది ఫిర్యాదును నమోదు చేయండి.

ఎక్కడ ఫిర్యాదు చేయాలి? అనే విషయంపై మోసం గురించి వెంటనే బ్యాంక్ కి తెలియచేయండి. తరువాత సైబర్ సెల్ లో రిపోర్ట్ చేయండి అని చెబుతున్నారు ఫిన్ కార్ట్ వ్యవస్తాపకుడు, CEO తన్వీర్ ఆలం. ఏటీఎంని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు సురేష్ లాగా మీ డబ్బును కోల్పోవచ్చు. సురేష్ చేసిన తప్పు మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని అందించింది. అతని కార్డ్ ATM మెషీన్‌లో ఇరుక్కుపోయినప్పుడు, సురేష్ ముందుగా ఏటీఎం బూత్‌పై రాసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు కాకుండా బ్యాంక్ కు కాల్ చేసి ఉండాలి. లేదా అతను బ్యాంక్ అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి. మీరు మాత్రం సురేష్ చేసిన తప్పు చేయకుండా అప్రమత్తంగా ఉండండి. ఏటీఎం ఫ్రాడ్ కు దొరికి పోయి డబ్బులు పోగొట్టుకోకండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి