హైదరాబాద్, ఆగస్టు 24: మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలుచేశారని ఆయనపై వేటు వేసింది తెలంగాణ హైకోర్టు. ఆయన ఎన్నిక చెల్లదంటూ కీలక తీర్పును వెల్లడించింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పును ఇచ్చింది కోర్టు. కృష్ణమోహన్రెడ్డికి 3 లక్షల జరిమానా… అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుంటే, రాబోయే ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా వనమా వెంకటేశ్వరరావు తరహాలోనే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డికి కూడా కోర్టు నుంచి స్టే లభిస్తే.. తన పదవి కాలం ముగిసిపోయే వరకూ ఎమ్మెల్యేగా కొనసాగే ఛాన్స్ ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ క్షణంలో హైకోర్టు నుంచి ఇలాంటి తీర్పు రావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఇచ్చిన ఊహించని తీర్పును ఎలా తీసుకుంటోయో చూడాల్సి ఉంది.
గద్వాల్ గడ్డా చేసుకుని రాజకీయం చేస్తున్న డికే అరుణ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న డీకే అరుణ.. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కర్నాటక రాష్ట్ర బీజేపీ సహఇంచార్జ్గా వ్యవహరిస్తున్నారు. అటు ఢిల్లీ, ఇటు కర్నాటక, మధ్యమధ్యలో హైద్రాబాద్.. ఇలా వరుస కార్యక్రమాలతో బీజీగా ఉన్నారు.
తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి ఈ తీర్పు అనుకూలంగానే ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఈ తర్పును తమకు అనుకూలంగా మర్చుకునేందుకు బీజేపీ ఫుల్ ప్లాన్ చేసుకుంటోంది. జోగాలాంబజిల్లా గద్వాల్ నియోజకవర్గం కీలకమైంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన డికే అరుణ.. ఇక్కడ బీజేపీకి బలంగా మారడంతో.. పొలిటికల్ సీన్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో పత్తాలేని బీజేపీకి.. అరుణ చేరికతో బలమైన బేస్ దొరికిందని చెప్పొచ్చు. నడిగడ్డ ప్రాంతంలో జాడలేని కమలం.. ఇప్పుడు బహిరంగ సభలు నిర్వహించుకునే స్థాయికి ఎదిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..