ఇంద్రకీలాద్రిపై భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మను సుమారు 60 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుర్గమ్మ ఆలయంలో ఇంజినీరింగ్, పరిపాలనా విభాగాల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా విధులు కేటాయించారు.
క్యూలైన్లో భక్తుల కోసం కూలర్ల ఏర్పాటు, మంచినీటి పంపిణీకి క్యాన్లు సిద్ధం చేస్తున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఆలయంలోని అన్ని అర్జిత టికెట్లుకు డిమాండ్ పెరిగింది. తెల్లవారుజామున ఖడ్గమాలతో పాటు లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన టికెట్లు భారీగా అమ్ముడయ్యాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..