శ్రీశైలానికి సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద గత ఆదివారం అర్ధరాత్రి సంచరించిన ఎలుగుబంటి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తూ హల్ చల్ చేసింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన కొబ్బరి చిప్పలు తింటూ అర్ధరాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో సంచరిస్తుంది. అయితే, తిరుమలలో చిరుత అటాక్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగ్ టేరన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు. ఇవాళ అర్ధరాత్రి 2 గంట సమయంలో ఎలుగుబంటి ఎట్టకేలకు బోన్లో చిక్కింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అయితే, చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు అధికారులు. ఎలుగుబంటిని వెలుగోడు సమీపంలోని సూదం అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.