Telangana: నాడు సైకిల్‌ తొక్కిన లీడర్స్.. నేడు కారులో సీనియర్‌ మోస్ట్‌ ప్యాసింజర్స్.. లాస్ట్ ఛాన్స్

|

Aug 21, 2023 | 8:36 AM

వాళ్లంతా ఒకప్పుడు సైకిల్‌ తొక్కిన సీనియర్లు. ఒక్కొక్కళ్లు ఒక్కో ఏరియాలో సైకిల్‌ ఛాంపియన్లు. కాలం మారింది. ఓడలు బళ్లయ్యాయి. బళ్లు ఓడలయ్యాయి. తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. చేసేది లేక సైకిల్‌ దిగి కారు ఎక్కారు. అయితే కారులో ఓ మూల సర్దుకుని కూర్చోవాల్సి వస్తోంది. టికెట్‌పై భరోసా లేదు. రాజకీయ భవిష్యత్‌కు గ్యారంటీ లేదు. చెప్పాలంటే వాళ్లు కారులో జస్ట్‌ ప్యాసింజర్లుగానే సాగుతున్నారు. పొలిటికల్‌ జర్నీలో లాస్ట్‌ మైల్‌కి చేరుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ రాకుంటే ఆ జర్నీకి కూడా ఫుల్‌స్టాప్‌ పడ్డట్టే. రాజకీయ రిటైర్‌మెంట్‌కి దగ్గరపడ్డట్టే. కారు దిగి వెళ్లలేరు. అలాగని ఓమూల సర్దుకుని ఉండలేరు. అలా ఉంటే ఇక అంతే సంగతులు. ఆ సీనియర్ల సీరియస్‌ అంతర్మథనం ఇది. 

తుమ్మల, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి, మండవ, ఎల్‌. రమణ, కడియం శ్రీహరి, వేణుగోపాలాచారి…వీళ్లంతా తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతలు. టీడీపీ హయాంలో సీనియర్‌ నేతలుగా మంత్రులుగా చలామణీ అయిన ఉద్దండ పిండాలు. అయితే ఇప్పుడు ఒక్క చాన్స్‌ ఒకే ఒక్క చాన్స్‌ అంటున్నారు. అసెంబ్లీ సీటు కోసం కారు సారు కేసీఆర్‌ని ప్రాధేయ పడుతున్నారు.  ఈసారి కాకపోతే మరోసారి అవకాశం ఉండదనేది ఈ సీనియర్ల భావనగా చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చాన్స్‌ రాకపోతే రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండదనే అనుమానం వాళ్లను వెంటాడుతోంది. ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలి. గెలవాలి. లేకపోతే రాజకీయాల నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో లాస్ట్‌ చాన్స్‌ రాకపోతే ఇక రిటైర్‌మెంట్ తప్పదనే భావనలో ఉన్నారు. అందుకే సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. తమ రాజకీయ జీవితానికి ఎండ్‌ కార్డు పడకుండా ఉండేందుకు నానా పాట్లు పడుతున్నారు. సీటు కోసం అన్ని ఫీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో పదవులు ఉన్నవాళ్లే లైమ్‌ లైట్‌లో ఉంటారు. పదవి లేకపోతే అంతే సంగతులు. ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ రాకపోతే ఈ సీనియర్లలో చాలామంది పొలిటికల్‌ కెరీర్‌కు ఇక ఫుల్‌స్టాప్‌ పడ్డట్టే అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Follow us on