తుమ్మల, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి, మండవ, ఎల్. రమణ, కడియం శ్రీహరి, వేణుగోపాలాచారి…వీళ్లంతా తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతలు. టీడీపీ హయాంలో సీనియర్ నేతలుగా మంత్రులుగా చలామణీ అయిన ఉద్దండ పిండాలు. అయితే ఇప్పుడు ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ అంటున్నారు. అసెంబ్లీ సీటు కోసం కారు సారు కేసీఆర్ని ప్రాధేయ పడుతున్నారు. ఈసారి కాకపోతే మరోసారి అవకాశం ఉండదనేది ఈ సీనియర్ల భావనగా చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చాన్స్ రాకపోతే రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండదనే అనుమానం వాళ్లను వెంటాడుతోంది. ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలి. గెలవాలి. లేకపోతే రాజకీయాల నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో లాస్ట్ చాన్స్ రాకపోతే ఇక రిటైర్మెంట్ తప్పదనే భావనలో ఉన్నారు. అందుకే సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. తమ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడకుండా ఉండేందుకు నానా పాట్లు పడుతున్నారు. సీటు కోసం అన్ని ఫీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో పదవులు ఉన్నవాళ్లే లైమ్ లైట్లో ఉంటారు. పదవి లేకపోతే అంతే సంగతులు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఈ సీనియర్లలో చాలామంది పొలిటికల్ కెరీర్కు ఇక ఫుల్స్టాప్ పడ్డట్టే అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.